హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని, పాలన గాడి తప్పిందన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 351, 351(3), 196(1) , 61 కింద FIR నమోదు చేయాలని కోరారు. సీఎంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పైన కూడా కేసులు నమోదు చేయాలని ఈ ఫిర్యాదులో కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరణించాలని కోరుకుంటూ లబ్ధిదారులు ‘వెయ్యి చప్పట్లు పేరుతో ర్యాలీ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. రోజు రోజుకు రాష్ట్రంలో ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇలాగే ఉంటే రాష్ట్రం రావణ కాష్టంగా మారడం ఖాయమన్నారు . సీఎంగా రేవంత్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తాత్సారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి కి ప్రజలు త్వరలో గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. అందరూ అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.






