హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మై హోం అధినేత జూపల్లి రామేశ్వర్ రావుపై. ఆయన శాసన సభ సాక్షిగా జూపల్లి అక్రమాలపై చిట్టా విప్పారు. ఆధారాలతో సహా వివరాలు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా జరిగిన భూ దోపిడీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధానంగా మై హోం అధినేత భూ దందాపై ఫైర్ అయ్యారు సీఎం. ఈ జూపల్లి రామేశ్వర్ రావు ఎవడు? వాడికి ఇంత భూమి ఎక్కడిది? అని ఉగ్రరూపం చూపించారు. ప్రత్యేకించి శంషాబాద్ ఎయిర్ పోర్టు పక్కన అత్యంత విలువైన 2,400 ఎకరాలు కొల్లగొట్టాడని ఆరోపించారు. ఈ భూమి ఎవరిది ప్రజలది కాదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
ఇంకో ఎయిర్పోర్ట్ కట్టేంత భూమి మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్ రావుకు ఎలా వచ్చింది? అని నిలదీశారు. ధరణిని అడ్డుపెట్టుకొని కేసీఆర్–మై హోమ్ కలిసి భూ దోపిడీకి, అక్రమాలకు తెర లేపారని మండిపడ్డారు. అసైన్డ్ భూములు, భూదాన్ భూములను అక్రమంగా తన బినామీకి కట్టబెట్టింది కేసీఆరేనని ఆరోపించారు. మేళ్లచెరువు, సూర్యాపేట జిల్లాలో కూడా మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర 300 ఎకరాలను వేరే వ్యక్తులను బెదిరించి మై హోమ్కు కట్టబెట్టారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా మై హోం అధినేత పై సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయ, వ్యాపార రంగాలలో కలకలం రేపాయి. ఇప్పటికే తనకు సపోర్ట్ చేస్తూ వస్తున్న చిన్నజీయర్ స్వామీజిపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి.





