
ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ : ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా మందలపు రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ప్రమాణం చేయించారు మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి సమన్వయ కమిటీ సమావేశాల్లో పరిచయమైన ఎన్ఆర్ఐ మందలపు రవికుమార్ సమన్వయకర్తగా అద్భుతంగా పనిచేశారని మంత్రి దుర్గేష్ కొనియాడారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా నాడు చంద్రబాబు నాయుడును జైళ్లో పెట్టిన సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చూపించిన చొరవను , అదే సందర్భంలో రాజమండ్రిలో నెలకొన్న పరిస్థితులను మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. నాడు ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా మందలపు రవికుమార్ వ్యవహరించిన తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఎన్ఆర్ఐల పాత్ర ప్రశంసనీయమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ మందలపు రవి కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు కల్పించిన అవకాశంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా పనిచేశానన్నారు. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ గా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ (చంటి), గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లిఖార్జునరావు, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, భవన నిర్మాణ, కార్మిక సంఘం అధ్యక్షులు, తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్ వలవల మల్లిఖార్జునరావు (బాబ్జి), ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్ మంతెన రామరాజు, పశ్చిమగోదావరి మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ ముళ్లపూడి బాపిరాజు, ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోమటి జయరామ్, నాగరాజు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.