విద్యార్థులతో కలిసి భోజనం చేసిన వైనం
తూర్పు గోదావరి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ఆదివారం పలు హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజన నాణ్యతను పరిశీలించారు. కనీస సౌకర్యాలు వారికి అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అంతకు ముందు పిల్లలతో కలిసి భోజనం చేశారు. పిల్లల పేరెంట్స్ తో ముచ్చటించారు. పిల్లలు ఎలా చదువుకుంటున్నారని అడిగారు. స్త్రీ శక్తి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో ప్రయోజనం పొందుతున్నామంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
విద్యార్థుల భద్రత కు ఆరోగ్య సంరక్షణ కు పెద్ద పీట వేసే క్రమంలో ప్రతి వసతి గృహం, పాఠశాలలో సీసీ కెమెరాలు, మినరల్ వాటర్ ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత తెలియ చేశారు. విద్యార్థులకు ప్రతి వారం వైద్య పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. తల్లిదండ్రులతో విద్యార్థులు మాట్లాడేందుకు కాయిన్ బాక్స్ ఫోన్ సౌకర్యం కల్పించాం అన్నారు. . ప్రస్తుతం అద్దె భవనంలో ఉన్న ఈ గురుకుల పాఠశాలకు త్వరలో స్వంత భవనం నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల అంచనా లకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలను వేగంగా అమలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కష్టాల్లో ఉన్న కుటుంబాలకు సమయానుకూల సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఆర్డీవో రాణి సుస్మిత, బీసీ సంక్షేమ అధికారి బి. శశాంక, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.






