మరోసారి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై ఫైర్
నిజామాబాద్ జిల్లా : మంత్రి వివేక్ వెంకటస్వామి హాట్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం జరిగిన మాలల సదస్సులో పాల్గొని ప్రసంగించారు. మంత్రి లక్ష్మణ్ నన్ను ఎందుకు టార్గెట్ చేసి విమర్శిస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. కష్టపడి పనిచేస్తున్న నాపై కుట్రలు చేయడం దారుణమన్నారు. మంత్రికి ఇది తగదన్నారు. రాజకీయాల్లోకి అడ్లురి లక్ష్మణ్ ని ప్రోత్సహించిందే మా నాన్న కాకా వెంకట స్వామి అని గుర్తు చేశారు. అది మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో జరిగిన మాలల గర్జన వల్ల మాలల్లో ఐక్యత పెరిగిందన్నారు. దేశంలో ఒక సామాజిక వర్గానికి చెందిన సభ పెద్దగా జరగటం అదే మొదటిసారి అని పేర్కొన్నారు.
మాలల కోసం పోరాటం చేస్తుంటే కొందరు కుట్రలు చేసి సోషల్ మీడియా వేదికగా తనను అవమించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సి రిజర్వేషన్ 15 నుండి 18 శాతం పెంచాలని తీర్మానం చేశామని, కానీ జరగలేదన్నారు. రోస్టర్ విధానంలో మాలలకు అన్యాయం జరిగిందని, పోరాడితేనే ఫలితాలు వస్తాయని అన్నారు వివేక్ వెంకట స్వామి. దేశంలో ఇంకా కులవివక్ష ఉందని, మాల ఉద్యోగులకు వేధింపులు తప్పటం లేదన్నారు. మంత్రిగా నా పని నేను చేసుకుంటూ పోతున్నానని, కానీ అడ్లూరి లక్ష్మణ్ తన మీద కావాలని విమర్శలు చేయడం దారుణమన్నారు. మంత్రి లక్ష్మణ్ అంశంలోను అనవసరంగా నా పేరు ప్రచారం చేశారని అన్నారు.






