
విజయవాడ : ఏపీ కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. గత వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ.4.9 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఎస్ విజయానంద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు వెల్లడించారు. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా రూ.4 కోట్ల 9 లక్షల 2వేలు బకాయిలను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు చైర్మన్.
దీనివల్ల ఏపీలో 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి చేకూరిందని, తద్వారా వారు క్రీడల్లో మరింత రానించేందుకు ఈ ప్రోత్సాహకాలు ఉపయోగ పడతాయని వివరించారు. క్రీడలు, క్రీడాకారుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందని స్పష్టం చేశారు అనిమిని రవి నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులందరూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి క్రీడాకారుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, ధీరజ్ బొమ్మ దేవర, షేక్ జాఫ్రిన్, షేక్ సాథియా ఆల్మస్, ఎ.అజయ్ కుమార్ రెడ్డి, డి.గ్రీష్మ, ఎం.సాహితి వర్షిని, ఏ శివనాగిరెడ్డి, రాయుడు అరుణ్ కుమార్, ఎ.సాయి సంహితి, కె.మోహన్ కిరణ్ కుమార్, కె. నారాయణ, కె. సంధ్య, ఎమ్.సత్యవతి, వి.రావణి, డి.వెంకటేశ్వర్, రియాజ్ సాబూ, గంపా ఆదిత్య వరుణ్, వి.మౌనిక, నాగ జ్ఞానదివ్య లు లబ్ది పొందారని పేర్కొన్నారు శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు.