ప్రకటించిన బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్
అమరావతి : ఏపీలో బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. మంగళగిరిలో నిర్వహించిన కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. ప్రతి కులానికి వారి సంస్కృతిని, గౌరవాన్ని ప్రతిబింబించేలా ఆత్మగౌరవ భవనాలు, సాంస్కృతిక భవనాలు, మన యువతకు ఉపాధినిచ్చే నైపుణ్య శిక్షణా కేంద్రాలు ప్రభుత్వమే తన సొంత ఖర్చుతో నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది తాము అడుగుతున్న డిమాండ్ కాదు, ఇది బీసీల హక్కు అని రామచంద్ర యాదవ్ ఉద్ఘాటించారు. ఏపీలో అన్ని బీసీలకు చెందిన అన్ని కులాల వారికి సరైన గుర్తింపు లేదన్నారు. అన్ని పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని ఆరోపించారు.
ఈ అన్యాయాన్ని ఇక చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు బోడె రామచంద్ర యాదవ్. బీసీల హక్కుల సాధన కోసం, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం, త్వరలోనే బీసీవై పార్టీ ఆధ్వర్యంలో, అన్ని బీసీ కుల సంఘాలు, మేధావులు, పెద్దలతో రాష్ట్ర స్థాయిలో ఒక భారీ చర్చా వేదికను ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్ పోరాట కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఇది కేవలం ఒక పార్టీ పోరాటం కాదు, ఇది బీసీలందరి ఉమ్మడి పోరాటం అని స్పష్టం చేశారు. ఈ పోరాటానికి బీసీలంతా ఏకమై, అండగా నిలవాలని పిలుపునిచ్చారు రామచంద్ర యాదవ్. మీ అందరి పక్షాన, ముందుండి ఈ యుద్ధాన్ని నడిపించే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు.






