
కీలక వ్యాఖ్యలు చేసిన నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ : శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి సిద్దప్ప ఎలాగో మాజీ సీఎం కేసీఆర్ కు తన్నీరు హరీశ్ రావు కీలకమైన వ్యక్తి అని పేర్కొన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్కు సంపద లాంటి వ్యక్తి హరీష్ రావు అని, ఆయనను బలహీన పరిచేలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు నష్టం కాదా అని ప్రశ్నించారు. జల దృశ్యంలో దిమ్మె కట్టించిందే హరీష్ రావు అన్నారు. ఏ పనిచెప్పినా ఎదురు మాట్లాడకుండా పని చేశాడన్నారు. కార్యకర్తగా, నేతగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉండి పనులు చేశారన్నారు. అనేక ఉప ఎన్నికల్లో తామంతా న్యూస్ పేపర్లు వేసుకుని ఒకే చోట నిద్రించిన వాళ్లం. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వాళ్లం అన్నారు నిరంజన్ రెడ్డి.
నాడు హరీష్ రావు పనితీరును పొగిడిన వారే నేడు ఆరోపణలు చేస్తుండడం దారుణమన్నారు. వారికి ఎలా మనసు ఒప్పుతుందో అర్ధం కావడం లేదంటూ వాపోయారు మాజీ మంత్రి. ఈటెల రాజేందర్ పార్టీ నుండి వెళ్లిపోవడంలో హరీష్ రావు పాత్ర లేదన్నారు. ఈటెల టీఆర్ఎస్లోకి రావడానికి కారణం తానేనని చెప్పారు. 2004 ఉప ఎన్నికలో హరీష్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అప్పటి నుండి దినదినం ప్రజాభిమానం చూరగొంటూ వచ్చారని, తన నుండి ఎంతో నేర్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు. వయసులో చిన్నవాడైనా దక్షతలో అన్న లాంటి వాడు అని అనేకసార్లు చెప్పానని గుర్తు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల మీద శాసనసభలో హరీష్ రావు కాంగ్రెస్ డొల్లతనాన్ని ఎండగట్టారని పేర్కొన్నారు.