బాధితులకు భరోసా ఇచ్చిన వైనం
గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రిని స్వయంగా కలిసి సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినతులు స్వీకరించారు. దేవాదాయ శాఖ కింద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న నాద స్వరం, డోలు, శృతి, తాళం వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అఖిల భారత నాయిబ్రాహ్మణ హక్కుల పరిరక్షణ సేవ, సంక్షేమ, జాతి ప్రక్షాళన సమితి ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వివిధ దేవాలయాల్లో సంప్రదాయ నిత్య కైంకర్య సేవలు, పూజల కోసం.. నాదస్వరం, డోలు, శృతి, తాళం నేర్చుకుని ఉన్నారని తెలిపారు.
వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులై, డిప్లమో అర్హత కలిగిన పూర్వ విద్యార్థులకు ఆయా పోస్టుల్లో అవకాశం కల్పించడంతో పాటు వయస్సు సడలింపు ఇవ్వాలని కోరారు. గత 70 ఏళ్లుగా బంజరు భూముల్లో నివాసం ఉంటున్న తమకు ఇంటి పట్టాలు మంజూరు చేసి అండగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటకు చెందిన గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లా ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన కోటావూరులో 60 కుటుంబాలు భూములు, ఇళ్లు కోల్పోయాయని, బాధితుల సమస్యలు పరిష్కరించడంతో పాటు త్వరతగతిన నష్టపరిహార నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ముంపు గ్రామ రైతులు మంత్రిని కలిసి విన్నవించారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం గోవిందపల్లికి చెందిన మహాదేవి జయశంకర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.






