నిప్పులు చెరిగిన ఎంపీ గురుమూర్తి
తిరుపతి జిల్లా : వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిలల గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ కూటమి సర్కార్ పై. పీపీపీ మోడల్ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రకు తెర లేపారంటూ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది నీట్ క్వాలిఫై అవుతున్నా, అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లు కేవలం 60 వేల లోపే ఉండటంతో లక్షలాది మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లేకపోతే విదేశాలకు వెళ్లి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని అన్నారు. దీని వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోస్తున్నాయని వాపోయారు.
బెలారస్, ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లిన విద్యార్థులు రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఎదుర్కొన్న బాధలు దేశం మొత్తం చూసిందన్నారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య పెరగాల్సిందేనని ఎంపీ స్పష్టం చేశారు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో, అత్యాధునిక సదుపాయాలతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. లండన్ హెల్త్ కేర్ సిస్టమ్ను మోడల్గా తీసుకుని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నుంచి గ్రామ స్థాయి వరకు వైద్య సేవలు చేరేలా వ్యవస్థను మార్చారని వివరించారు.
ఈ సంస్కరణలలో భాగంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయం కొన్నిటికే లభించినా, మిగిలిన కాలేజీలకు నాబార్డ్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా ఆర్థిక సహాయం తీసుకొని వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలని అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తై, కొన్ని మెడికల్ సీట్లు కూడా అలాట్ అయినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం ఆ సీట్లు వద్దని కేంద్రానికి రికమెండ్ చేయడం, ఎక్కడికక్కడ మెడికల్ కాలేజీల నిర్మాణాలను ఆపివేయాలని జీవోలు, సర్క్యులర్లు జారీ చేయడం జరిగిందని ఆరోపించారు.





