
అబద్దాలకు కేరాఫ్ వైసీపీ అధ్యక్షుడు
అనంతపురం జిల్లా : అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ బిగ్ సక్సెస్ అయ్యిందన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. రాయలసీమ భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కొత్త దిశా నిర్దేశం చేస్తోందని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజమండ్రిలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో 90 శాతం అమలు చేశామని, అందుకే ప్రజల ముందుకు వచ్చామని చెప్పారు. జగన్ తన పాలనలో ప్రజల్లోకి రాలేదన్నారు. ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలు చేయడం తప్ప ఆయనకు మరే అజెండా లేదన్నారు. మూడు రాజధానులంటూ అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేసిన పాపాన పోలేదన్నారు పల్లా శ్రీనివాస రావు.
విశాఖ ఉక్కు ప్రైవేటుపరం అవుతోందని గగ్గోలు పెడుతూనే కేంద్రం నుండి ఒక్క రూపాయి తెచ్చుకోలేక పోయారని మండిపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో రూ.14 వేల కోట్లు తెచ్చి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను 80 శాతం సామర్థ్యంతో నడుస్తున్న స్థితికి తీసుకు వచ్చేలా చేసిందన్నారు. అమరావతి, రాయలసీమ, ఉత్తరాంధ్రపై జగన్ ఫేక్ ప్రచారాలు మాత్రమే చేస్తున్నారు అని విమర్శించారు. ఎన్టీఆర్ వేసిన బీజాలు, చంద్రబాబు హయాంలో ఫలితాలు ఇచ్చాయన్నారు. డ్రిప్ ఇరిగేషన్ తో అనంతపురం హార్టికల్చర్ హబ్ గా మారిందన్నారు. చంద్రబాబు విజన్తో కియా మోటార్స్ రాకతో ఆటోమొబైల్ కు కేరాఫ్ గా మారింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు పల్లా శ్రీనివాస రావు.