మూల విరాట్ కు గోదా మాలలు
తిరుమల : శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదా మాలాలు శ్రీవారి మూలవిరాట్కు అలంకరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవి మాలలు తిరుపతి నుండి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జియర్ స్వామివారి మఠానికి చేరుకున్నాయి. అనంతరం పెద్ద జియ్యార్ మఠం నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు.
ఇదిలా ఉండగా ఈ పరిణయోత్సవ కార్యక్రమం ప్రతి ఏటా కొనసాగుతూ వస్తోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూల విరాట్టుకు అలంకరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జియర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జియర్ స్వామి, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.






