జనవరి 25 న శ్రీవారి ఆలయంలో రథ సప్తమి
తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. జనవరి 25న శ్రీవారి ఆలయంలో రథ సప్తమి జరుగుతుందని తెలిపారు. ఈవో మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామని చెప్పారు ఈవో. దాదాపు 3 వేల మందికి పైగా పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తారని తెలిపారు. పబ్లిక్ అడ్రెస్ సిస్టం ద్వారా భక్తులకు అవసరమై సమాచారాన్ని వివిధ భాషల్లో అందచేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు కూడా టీటీడీ ఇచ్చే సూచనలు పాటిస్తూ టీటీడీకి సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా గత సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీ 1900 ట్రిప్పులను నడుపగా, ఈ సంవత్సరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 2300 ట్రిప్పులను నడిపేందుకు చర్యలు చేపట్టిందన్నారు.
శ్రీవారి వాహనసేవల ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.వాహన సేవల ముందు 56 రకాల కళా రూపాలను 1000 కళాకారులతో ప్రదర్శన ఉంటుందన్నారు. భక్తుల సౌకర్యార్థం మెరుగైన పారిశుద్ధ్య సేవలు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు.గ్యాలరీల్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందుకు అవసరమైన అదనపు సిబ్బంది ఏర్పాటు చేశామన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. భక్తులకు అత్యవసర సేవలందించడానికి వీలుగా అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్సు వాహనాలు సిద్ధం చేశామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా వాహన సేవలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామన్నారు.రథ సప్తమి సందర్భంగా టీటీడీ కల్పించిన సదుపాయాలను వినియోగించుకుని భక్తులందరూ సంయమనంతో వాహన సేవలను వీక్షించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులవ్వాలని కోరారు.







