కీలక ప్రకటన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దావోస్ లో జరిగిన ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. మంత్రులు రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ తో పాటు టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా నాలుగు రోజుల పాటు జరిగిన ఈ పర్యటన తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పారు చంద్రబాబు. ఏపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులు వచచ్చాయని అన్నారు. రాష్ట్రానికి వివిధ కంపెనీల ద్వారా రూ. 2.50 లక్షల కోట్లు పెట్టుబడి రూపంలో రానున్నాయని తెలిపారు. శుక్రవారం ఉదయం 8.25 నిమిషాలకు హైదరాబాద్కు చేరుకున్నారు సీఎం. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. మొత్తంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో 36కు పైగా సమావేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు.
ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచ ఆర్ధిక సదస్సు వేదిక వద్ద ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అర్వింద్ కృష్ణ సహా 16 దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. 9కి పైగా సెషన్స్, సమావేశాలకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీలను అంచనా వేసేందుకు కూడా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు దోహదం చేసిందని సీఎం అభిప్రాయపడ్డారు. తన పర్యటనలో యూరప్ లోని తెలుగు ప్రజలతో మమేకం అవుతూ తెలుగు డయాస్పోరా ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. దావోస్ వేదికగా జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులకూ ప్రత్యేక ఇంటర్వూలు ఇచ్చారు.






