సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి రోజా
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. అరాచక పాలన సాగిస్తూ ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడని, కేసులు నమోదు చేయిస్తూ బయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆర్కే రోజా సెల్వమణి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ హయాంలో నిర్మించిన ఆస్పత్రిలో చంద్రబాబు చెత్త ఊడుస్తాడని పేషెంట్లను బయటకు పంపించి క్లీన్ చేశారని అన్నారు. నగరి ప్రజలు నమ్మరని క్లీనింగ్ కార్యక్రమం రద్దు చేసుకున్నారు. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ పెద్ద అబద్ధం అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సూపర్ సిక్స్లో మొదటిది నిరుద్యోగ భృతి ఇచ్చారా అని నిలదీశారు ఆర్కే రోజా సెల్వమణి. 19 నెలలకు రూ.45 వేలు ఒక్కో నిరుద్యోగికి ఇచ్చారా..? ఫస్ట్దే సూపర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. రెండవది ఆడబిడ్డ నిధి పథకం.. 18 ఏళ్లు పైబడిన మహిళలకు రూ.1500 ఇస్తామన్నారు. ఒక్కొక్కరికీ రూ.20 వేలు ఎగనామం పెట్టారంటూ మండిపడ్డారు ఆర్కే రోజా సెల్వమణి. సిగ్గు లేకుండా ఎలా సూపర్ సిక్స్ – సూపర్ హిట్ అని చెప్పుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, కేవలం ప్రచారం తప్పా ప్రజలకు పని చేసింది ఏమీ లేదన్నారు మాజీ మంత్రి.






