ఖండించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ : ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు మరికొందరు మంత్రులు రహస్య సమావేశం నిర్వహించినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా అబద్దమని, నిరాధారమని, అవాస్తవాలను ప్రచారం చేయొద్దంటూ సూచించారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. రహస్యంగా సమావేశం కావాల్సిన అవసరం ఏముందంటూ తిరిగి ప్రశ్నించారు శ్రీధర్ బాబు. ఈ నివేదికలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ వాపోయారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు మాట్లాడుకోవడం, చర్చించు కోవడం సహజమని పేర్కొన్నారు.
కేబినెట్ లో మంత్రులు భేటీ కావడం అనేది సర్వ సాధారణమని స్పష్టం చేశారు శ్రీధర్ బాబు. దీనిపై పెడర్థాలు వచ్చేలా కామెంట్స్ చేయడం, లేనిపోని కల్పించి కథనాలు అల్లడం ఈ మధ్య పరిపాటిగా మారిందంటూ మండిపడ్డారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించే వారి మధ్య జరిగే చర్చలను వక్రీకరించకూడదు లేదా అనవసరమైన రాజకీయ రంగు పులమకూడదు అని మంత్రి అన్నారు. సోషల్ మీడియాలో , కొన్ని మీడియా సంస్థల ద్వారా ప్రచారం చేయబడుతున్న తప్పుడు కథనాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.






