ఆయన బోధనలు ఆచరణీయమైనవని ప్రశంస
విశాఖపట్నం జిల్లా : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర్ రావును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు . ఈ సందర్భంగా చాగంటి దంపతులను కలవడం జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నారు. భారతీయ సనాతన ధర్మం, మత సామరస్యం, నైతిక విలువల గురించి సమాజాన్ని మేల్కొల్పడంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చేస్తున్న కృషి, ప్రయత్నం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు అనిత వంగలపూడి.
ఇదిలా ఉండగా ఆయన చేస్తున్న కృషికి తగిన రీతిలో గుర్తింపును తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారని తెలిపారు. ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తిగా ఇప్పటికే పేరు పొందారని, ఆయనతో మాట్లాడుతూ ఉంటే కాలం అనేది ఒకటి ఉందనేది కూడా మరిచి పోతామన్నారు వంగలపూడి అనిత. ఇదిలా ఉండగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు వారి ప్రవచనాలు అందించాలని కోరారు. అంతే కాకుండా అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించు కోవాలని విన్నవించారు . తన విన్నపాన్ని మన్నించి, ఫిబ్రవరి నెలలో మన నియోజకవర్గానికి విచ్చేస్తానని వారు హామీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వంగలపూడి అనిత.






