విద్యార్థులు డిజిటల్ ట్విన్ ప్రాజెక్టును తయారు చేయాలి
కాకినాడ : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కాకినాడ జేఎన్టీయూ విద్యార్థులతో ముఖా ముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఒక ధార్మిక కార్యక్రమానికి కోట్లాది మంది వచ్చినపుడు క్రౌడ్ మేనేజ్ మెంట్, క్రౌడ్ మూమెంట్ పర్యవేక్షణ చాలా ముఖ్యం అన్నారు. కుంభమేళా సమయంలో అక్కడి ప్రభుత్వం అద్భుతంగా చేసింది. ఘాట్లన్నింటినీ డిజిటల్ ట్విన్ తో అనుసంధానించారు. క్రౌండ్ మేనేజ్ మెంట్ ఎలా మేనేజ్ చేయాలో అక్కడ చూశాం. గతంలో రాజమండ్రి పుష్కరాల సమయంలో దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారు. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే సివిల్ వర్క్స్ స్టార్ట్ చేశాం. పుష్కర ఘాట్లలో క్రౌడ్ మేనేజ్ మెంట్, సౌకర్యాలపై ఎప్పటికప్పుడు తెలుసుకునేలా జేఎన్టీయూ ద్వారా డిజిటల్ ట్విన్ ప్రాజెక్టును తయారు చేయాల్సిందిగా జేఎన్టీయూ మేనేజ్మెంట్ కు విజ్ఞప్తిచేస్తున్నానని అన్నారు నారా లోకేష్.
ఇదే సమయంలో తనకు , పవన్ కు మధ్య ఉన్న బాండింగ్ గురించి కూడా పంచుకున్నారు. 2014 ఫలితాల తర్వాత తొలిసారి హైదరాబాద్ లో ఫస్ట్ టైమ్ పవనన్నను కలిశా. జీవన ప్రయాణంలో ఎంతో మందిని కలుస్తుంటాం. కొందరి కలయిక ప్రత్యేకంగా నిలిచి పోతుంది. చంద్రబాబును రిమాండ్ లో పెట్టినపుడు పవనన్న వచ్చాడు. అక్కడ మాట్లాడుకున్నాం. తర్వాత థార్ వాహనంలో ఎక్కాం. ముందు పవనన్న, నా పక్కన బాలయ్య బాబు కూర్చున్నారు. నేను చాలా టెన్షన్ గా ఫీలయ్యాను. ఆరోజు పవనన్న మమ్మల్ని పలకరించి, కుటుంబానికి అండగా నిలబడిన విధానం జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. మంచిగా ఉన్నపుడు అంతా మనవద్దకు వస్తారు. కష్ట కాలంలో తక్కువ మంది మాత్రమే అండగా ఉంటారు. ఎవరైతే కష్టకాలంలో మన వెంట నిలబడతారో… అటువంటి వారిని జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని అన్నారు.






