అభినందించిన జేఈవో డాక్టర్ ఎ. శరత్
తిరుపతి : శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి ముంబైకు చెందిన అల్కెమ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధురిమ సింగ్ రూ. 90 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందించారు. ఈ పరికరాలను టిటిడి జేఈవో (ఆరోగ్యం , విద్య) డా. ఎ. శరత్ కు అందజేశారు. ఇందులో భాగంగా 4 హై ఎండ్ వెంటిలేటర్లు , 4 హ్యూమిడిఫయర్లు , 4 హెచ్ఎఫ్ఎన్సీ (హై ఫ్లో నాసల్ కేన్యులా పరికరాలు) ఉన్నాయి.
ఈ సందర్భంగా జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ చిన్నపిల్లల హృదయ చికిత్సలకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న నూతన చిల్డ్రన్స్ ఆసుపత్రికి అవసరమైన పరికరాలను విరాళంగా అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని ప్రశంసించారు. అల్కెమ్ ఫౌండేషన్ మరింత అభివృద్ధి సాధించాలని, శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం లభించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మధురిమ సింగ్ ను శాలువాతో సత్కరించారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్, అల్కెమ్ ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.







