స్పష్టం చేసిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి
శ్రీశైలం : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా రహదారుల మరమ్మత్తులు యుద్ద ప్రాతిపదికన ఈనెల 8వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శ్రీశైలానికి తరలివచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆత్మకూరు నుంచి దోర్నాల వరకు ఉన్న ప్రధాన రహదారుల మరమ్మతులు, విస్తరణ, గుంతల పూడిక, రహదారి భద్రతా చర్యలతో కూడిన పనులపై నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలన్నారు.
ఉత్సవాల సమయంలో వాహనాల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో రహదారులు సక్రమంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టాలని సూచించారు. భక్తుల సౌకర్యమే లక్ష్యంగా అధికారులు సమిష్టిగా పనిచేసి, ఏ చిన్న లోపం కూడా తలెత్తకుండా సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా, ఘనంగా, విజయవంతంగా జరిగేలా ప్రతి శాఖ బాధ్యతతో పని చేయాలని మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి అన్నారు.
ఎక్స్-ఆఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ లు మాట్లాడుతూ ఈ సారి గతం కంటే 30 శాతం అధిక మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు .జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ఫిబ్రవరి 8 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఖచ్చితమైన ప్రణాళికలతో విధులు నిర్వహించేలా గత సమావేశంలో అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.







