అమెరికా టారిఫ్ తగ్గింపు ఆక్వా రంగానికి శుభవార్త
అమరావతి : అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం కింద ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం లభిస్తుందన్నారు. గతంలో 25 శాతం టారిఫ్కు అదనంగా శిక్షాత్మక టారిఫ్లతో కలిపి మొత్తం 50–58 శాతం వరకు టారిఫ్ భారం పడిందన్నారు. 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో అమెరికాకు భారతదేశం నుంచి జరిగే సముద్ర ఆహార ఎగుమతులు పరిమాణంలో సుమారు 15 శాతం తగ్గి 2.01 లక్షల మెట్రిక్ టన్నులకు, విలువలో 6.3 శాతం తగ్గి 1.72 బిలియన్ అమెరికన్ డాలర్లకు పడిపోయాయని గుర్తు చేశారు.
ముఖ్యంగా అమెరికాకు ప్రధానంగా ఎగుమతి అయ్యే ఫ్రోజెన్ ష్రింప్ ఈ పరిస్థితి వల్ల తీవ్రంగా ప్రభావితమైందన్నారు అచ్చెన్నాయుడు. టారిఫ్ను 18 శాతానికి తగ్గించడంతో అమెరికా మార్కెట్లో భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల పోటీ సామర్థ్యం గణనీయంగా మెరుగు పడిందని, నిలిచిపోయిన కొత్త ఎగుమతి ఆర్డర్లు తిరిగి ప్రారంభమవుతూ, బాండెడ్ గోదాముల్లో నిల్వ ఉన్న సరుకును విడుదల చేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. రాబోయే నెలల్లో అమెరికాకు సముద్ర ఆహార ఎగుమతులు 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అన్నారు మంత్రి. 2025–26 రెండో అర్ధభాగంలో ఎగుమతులు టారిఫ్కు ముందు ఉన్న స్థాయికి చేరుకునే అవకాశముందని చెప్పారు.





