డిమాండ్ చేసిన బొలిశెట్టి సత్య నారాయణ
విశాఖపట్నం : జనసేన సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్య నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రూ. 1,00,000 కోట్ల పర్యావరణ నష్టానికి కారణమైన వారిని శిక్షించేందుకు స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు . ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతాన్ని విషతుల్యం చేస్తున్న కాలుష్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ, పాత నివేదికలనే “కట్ అండ్ పేస్ట్” చేస్తూ GVMC, APPCB అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. శుద్ధి చేయని మురుగు నీరు సముద్రాన్ని నిరంతరం కలుషితం చేస్తూనే ఉందన్నారు.
గత 10 ఏళ్లుగా జరిగిన పర్యావరణ నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వేతర నిపుణులతో (Non-Government Experts) ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మేధావులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నా ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు లేవన్నారు బొలిశెట్టి సత్య నారాయణ. APPCB , GVMC ల నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టం అక్షరాలా లక్ష కోట్లకు పైమాటేనని నిపుణుల అంచనా వేశారని తెలిపారు. కాలుష్యం చేసిన వారే నష్ట పరిహారం చెల్లించాలనే (Polluter Pays Principle) సుప్రీం కోర్టు నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.






