పార్కుల అభివృద్దికి ప్రయత్నం చేస్తాం
హైదరాబాద్ : హైదరాబాద్ లో ఆక్రమణదారుల భరతం పడతామని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. సెలవు రోజుల్లో మినహా ప్రతి శనివారం 040-29565750, 040-29565759 ఈ నంబర్లకు ఫోను చేసి సమస్యలను తెలియ జేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాల నుంచి కూడా కొన్ని ఫోన్లు వచ్చాయని చెప్పారు. అక్కడ కూడా చెరువులు ఆక్రమణలకు గురౌతున్నాయని, వాటిని కాపాడాలని పలువురు కోరారు. ఓఆర్ ఆర్ వరకే హైడ్రా పరిధి అంటూ.వారికి కమిషనర్ సర్ది చెప్పారు. మొదటి విడత 6 చెరువులు చేపట్టగా త్వరలోనే 14 చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ఇలా దశలవారీ చెరువులను అభివృద్ధి చేస్తున్నామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.
చెరువులు సహజ లక్షణాలను కోల్పోయాయని, వాటిని పునరుద్ధరించాలని ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులందాయని అన్నారు. పార్కులు, రహదారులు, ప్రభుత్వ స్థలాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురి అవుతున్నాయని పేర్కొన్నారు. ఫుట్పాత్లు ఆక్రమణకు గురై.. నడక దారి లేకుండా చేస్తున్నారంటూ నగరం నలుమూలల నుంచి హైడ్రా ఫోన్ ఇన్ కార్యక్రమానికి ఫిర్యాదులు అందాయన్నారు. దుండిగల్ మున్సిపాలిటీలోని గాగిలాపూర్లో రహదారులను ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ప్రగతి నగర్ వద్ద ఓ పార్కులో ఆలయం కట్టడానికి ప్రయత్నిస్తున్నారని, నాగిరెడ్డి కుంటలోకి మురుగు నీరు చేరకుండా డైవర్ట్ కాలువ నిర్మాణ పనులు ఆగిపోయాయని అన్నారు.





