నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈనెల 9, 10 తేదీల్లో పెద్ద ఎత్తున మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కారు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దీనిపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కవిత. ఒక్కో ఉద్యోగానికి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని నిరుద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో దొడ్డిదారిన అక్రమ నియామకాలు చేపట్టడం దారుణమన్నారు. దీని వల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగులు, యువత నోట్లో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మట్టి కొడుతోందన్నారు కల్వకుంట్ల కవిత. ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని, దానిలో ఇప్పటి వరకు కొన్నింటిని మాత్రమే అమలు చేశారని ధ్వజమెత్తారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు కేవలం 10 వేల జాబ్స్ మాత్రమే భర్తీ చేశారని ఫైర్ అయ్యారు. విచిత్రం ఏమిటంటే 70 వేల పోస్టులు భర్తీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.





