స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో ఎవరైనా సరే , ఏస్థాయిలో ఉన్నా సరే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను ఆక్రమిస్తే తోలు వలుస్తామని, చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ప్రజా వాణి సందర్బంగా బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా గచ్చి బౌలిలోని టీఎన్జీవో కాలనీ లే ఔట్ వేసినప్పుడు సెప్టిక్ ట్యాంకుతో పాటు వాటర్ట్యాంకర్కు స్థలాన్ని కేటాయించారు. అక్కడ కొంత మందికి ప్లాట్లు రాగా.. వేరే చోటకు తరలించారు. ఇప్పడు ఆ వాటర్ ట్యాంకర్, సెప్టిక్ ట్యాంకర్ ప్రాంతంలో ప్లాట్లు వేసి విక్రయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, ఆ స్థలాన్ని ప్రజావసరాలకు ఉపయోగపడేలా కాపాడాలని హైడ్రాను అక్కడి నివాసితులు కోరారు.
మణికొండ ల్యాంకోహిల్స్కు చేరువలో ఉన్న ఎల్లమ్మ చెరువును నలువైపులా కబ్జాలు చేశారని, అక్కడ రేసు కోర్సు, క్రికెట్ క్రీడాస్థలం, పక్కనే పార్కింగ్తో పాటు రియల్టర్లు కూడా కబ్జాలు చేస్తున్నారని.. ఇటీవల 3 నెలల్లో అక్కడ ఒక భవనం నిర్మాణం జరిగిందన్నారు. వెంటనే చెరువు హద్దులను నిర్ధారించి ఆక్రమణలను నియంత్రించాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. చెరువు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని కోరారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు సమీపంలోని ఖానామెట్లో ఆల్ ఇండియా వెలమ సంఘానికి 5ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలం చుట్టూ ప్రీకాస్ట్ వాల్తో ప్రహరీ నిర్మిస్తుండగానే.. కుల సంఘాలకు స్థలాలు కేటాయించడంపై కొంతమంది కోర్టుకెక్కడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే అదనుగా ఆ స్థలాన్ని వెనుక వైపు నుంచి అక్కడ ఉన్న స్థానికులు మట్టిపోస్తూ కబ్జా చేస్తున్నారని.. అదేమని అడిగితే వాచ్మ్యాన్పై దాడి చేస్తున్నారని ఆ సంఘం ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.






