విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వార్నింగ్
గుంటూరు జిల్లా : సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు తమ పనితీరు మార్చుకోవాలని లేక పోతే చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. రానున్న పదవ తరగతి పరీక్షల్లో సీ గ్రేడ్ లో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఉత్తమమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా వసతి గృహాల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతుల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వంలో ఉన్న రూ. 110 కోట్ల డైట్ చార్జీల బకాయిలు చెల్లించడంతోపాటు, ఇప్పటి వరకు అన్ని వసతి గృహాల డైట్ చార్జీలను పెండింగ్ లేకుండా చెల్లించడం జరుగుతుందన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థుల సైతం తమ పిల్లలుగానే భావించి సంక్షేమ అధికారులు వారికి సక్రమంగా డైట్ అమలు చేయడంతో పాటు, నాణ్యమైన విద్యను అందించేలా ఇతర శాఖలకు ఆదర్శంగా పని చేయాలన్నారు.
కొంతమంది సంక్షేమ అధికారుల నిర్లక్ష్యమైన పనితీరు వల్ల మొత్తం శాఖకే చెడ్డ పేరు తెస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 397 వసతి గృహాలకు రూ. 13.10 కోట్లతో , జిల్లాలోని మినరల్ ఫండ్స్ దాదాపు రూ. 30 కోట్లతో మౌలిక సౌకర్యాలు ,మరమ్మత్తులు చేయటం జరిగిందన్నారు. మరిన్ని మౌలిక సౌకర్యాల కోసం ఎస్ఎఎస్సీఐ నిధులు రూ. 20 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా రూ. 20 కోట్లతో యూపీఎస్ లు, సురక్షితమైన తాగునీరు కోసం రూ. 15 కోట్ల తో ఆర్వో ప్లాంట్లు, రూ. 6 కోట్లతో దోమల నివారణకు మస్కిటో ప్రూఫింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు మంత్రి సవిత. స్వచ్ఛభారత్ నిధులతో 971 మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించామని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి నూరు శాతం వాటి అందుబాటులోకి తీసుకు రానున్నామన్నారు.





