హైడ్రాకు కూకట్ పల్లి, ప్రగతినగర్ వాసుల కృతజ్ఞతలు
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. కబ్జాదారులకు కోలుకోలేని షాక్ ఇస్తోంది. చెరువులే కాదు ప్రభుత్వ పార్కులను సైతం వదలడం లేదు. దీంతో హైడ్రా దెబ్బకు కిమ్మనడం లేదు. తాజాగా కూకట్పల్లి – ప్రగతినగర్లను కలుపుతూ చెరువు మధ్యలోంచి వేసిన రహదారిపై ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగడంతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది తొలగిందని రాకపోకలు ఎంతో సులభం అయ్యిందని పేర్కొన్నారు.
భారీ ఎత్తున్న రోడ్డుకు ఇరువైపులా వేసిన చెత్తను తొలగించడంతో దుర్గంధం తగ్గిందన్నారు. ఒకప్పుడు పక్షుల కిలకిలరావాలతో.. వల సపక్షుల విడిదితో ఆహ్లాదంగా ఉన్నప్రగతినగర్ (అంబీర్) చెరువుకు హైడ్రా పూర్వ వైభవం తీసుకురావాలని పలువురు ఈ సందర్భంగా హైడ్రాను కోరారు. హైడ్రా చర్యలకు మద్దతు ప్రకటించారు. చెరువులో మీటర్లకొద్దీ ఉన్న పూడికను తొలగించి.. మురుగు నీరు కలవకుండా డైవర్ట్ చేయడం, ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే ఈ చెరువు అభివృద్ధి పనులు చేపట్టాలని హైడ్రాను కోరారు. నగరంలో ఇతర చోట్ల అభివృద్ధి చేసిన మాదిరే ప్రగతినగర్ చెరువు రూపురేఖలను కూడా మార్చాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.






