2 లక్షల మందికి పైగా దర్శించుకున్న భక్తులు
నంద్యాల జిల్లా : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా భక్తులు పోటెత్తారు. ప్రారంభం నుంచి నేటి దాకా 2 లక్షల 50 వేల మందికి పైగా దర్శించుకున్నారు .ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు నంద్యాల జిల్లా ఎస్పీ. ఇందులో 70 వేల మందికి పైగా శివ స్వాములు ఉన్నారని తెలిపారు. 8వ తేదీన 45,360 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, 9న 49,0115 మంది, 10వ తేదీన 70,930 మంది దర్శనం చేసుకోగా అందులో 22,424 మంది శివ స్వాములు ఉన్నారని చెప్పారు ఎస్పీ.
11 వ తేదీ బుధవారం మధ్యాహ్నం 01 గంటల వరకు సుమారు 60 వేల మంది దర్శనం చేసుకోగా వారిలో 5,480 మంది శివ స్వాములు ఉన్నారని తెలిపారు. శ్రీశైలంలో ప్రశాంత వాతావరణంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని , ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. భక్తుల అనూహ్య రద్దీ కారణంగా కొన్ని చిన్నపాటి ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలపై సామాజిక మాధ్యమాల వేదికగా అసత్య ప్రచారాలు చేయొద్దని సూచించారు. ఒకవేళ అలా చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు..





