తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన టీడీపీ అధ్యక్షుడు
అమరావతి : ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు తమ పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తీరు గురించి ప్రస్తావించారు. గురువారం శాసన సభకు విచ్చేశారు ఎమ్మెల్యేతో పాటు పార్టీ చీఫ్. సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారని తెలిపారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మీరు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలని పేర్కొన్నారు. అలా కాకుండా పార్టీ రూల్స్ కు విరుద్దంగా ప్రవర్తించడం, మాట్లాడటం మంచి పద్దతి కాదని సూచించారు.
ఎవరైనా సరే పార్టీ అనేది ముఖ్యమని, పార్టీ తర్వాతే ఎవరైనా అన్న విషయం గుర్తు పెట్టుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస రావుకు స్పష్టం చేశారు పార్టీ బాస్ పల్లా శ్రీనివాసరావు. ఇవాళ ఈ ఇద్దరూ శాసన సభ లాబీలో కలుసుకున్నారు. చాలా సేపు మాట్లాడారు. క్రమశిక్షణ అనేది ముఖ్యమని, అది పార్టీ కార్యకర్త అయినా లేక నేతలు అయినా, మంత్రులు, ఎమ్మెల్సీలు, మంత్రులకు వర్తిస్తుందని అన్నారు. పార్టీ లైన్ దాటితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ విషయం పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అనుభవ రాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కొలికిపూడి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. సీనియర్లు తనకు మార్గదర్శకం చేయాలని కోరారు పల్లా శ్రీనివాసరావును.





