
సీఎంను కలిసిన అగర్వాల్ సమాజ్ ప్రతినిధి బృందం
హైదరాబాద్ : మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలకు హాజరు కావాలని తెలంగాణ అగర్వాల్ సమాజ్ ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఆహ్వానించారు. సెప్టెంబర్ 22న సాయంత్రం శంషాబాద్లోని క్లాసిక్ కన్వెన్షన్ 3 లో 5149వ మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలు జరుగుతాయని సీఎం కు వివరించారు. అగర్వాల్ సమాజ్ తెలంగాణ చేపట్టిన వివిధ కార్యక్రమాలను కూడా తెలిపారు. సమయం కుదిరితే ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వారిలో తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా , సలహాదారులు బద్రి విశాల్ బన్సాల్, హరీష్ గుప్తా , సంజయ్ గుప్తా , యస్సావి ఉన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా మాట్లాడారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో తమ సంస్థ ఎన్నో సేవలు అందించిందని తెలిపారు. .1998లో గుజరాత్లో విధ్వంసకర తుఫాను, 1999లో ఒడిశాలో భయంకరమైన తుఫాను, 2004లో తమిళనాడులో సునామీ మహావిపత్తు, 2013లో కేదార్నాథ్లో వినాశకరమైన మేఘ విస్ఫోటనం, 2020లో కరోనా మహమ్మారి సమయంలో సంస్థ సభ్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, అసంఖ్యాకమైన ప్రజలకు ఆహారం, మందులు, రక్తం, ఆక్సిజన్ యంత్రాలు మొదలైనవి అందించామన్నారు. బాధితుల ప్రాణాలను కాపాడటంలో మరపురాని ధైర్యాన్ని ప్రదర్శించారని ముఖ్యమంత్రికి వివరించామన్నారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యకలాపాలను సజావుగా కొనసాగించడానికి అగర్వాల్ సమాజ్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ‘శక్తివంతమైన సమాజం ఉజ్వల భవిష్యత్తు’ కోసం తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఒక భారీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అనిరుధ్ గుప్తా వెల్లడించారు.