గోవిందా గోవిందా నినాదాలతో మోర్మోగ్రిన క్షేత్రం
తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉదయం దివ్య మంగళ హారతుల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు పుష్పాలతో, పతాకాలతో అలంకరించిన మహారథాన్ని అధిరోహించి భక్త కోటికి కృపాకటాక్ష దర్శనం ప్రసాదించారు. “గోవిందా… గోవిందా…” నినాదాలతో మారుమోగిన ఆలయ పరిసరాల్లో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు, మంగళ వాయిద్యాలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.
శ్రీవారి రథ దర్శనం జన్మ జన్మాంతర పాపాలను హరించి భక్తులకు మోక్ష సౌభాగ్యం ప్రసాదిస్తుందని, రథస్థుడైన మాధవుడి దర్శనం పునర్జన్మ బంధనాలను నివారిస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు.ఈ దివ్య ఉత్సవ శ్రేణిలో భాగంగా రాత్రి 7 గంటలకు స్వామి వారు అశ్వ వాహనంపై విహరిస్తూ భక్తులకు పుణ్యదర్శనం అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎల్.ఏ.సీ. ప్రెసిడెంట్ ఏ.వి. రెడ్డి, ఆలయ ఏఈవో రమేష్, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్పెక్టర్ నిరంజన్ కుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.






