కీలక ప్రకటన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి వల్ల రాష్ట్రంలో అతి పెద్ద ఉక్కు ఆధారిత పరిశ్రమ రాబోతోందని , ఇందుకు త్వరగా అడుగులు పడబోతున్నాయని చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు మార్చి 7న శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైందని తెలిపారు. ఈ వార్త ఖరారవ్వడం తెలుగు వ్యక్తిగా గర్వంగా ఉందన్నారు కొల్లు రవీంద్ర.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో ఏర్పాటు చేసే ఈ ప్లాంటుతో సుమారు 50 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చే ప్రాధాన్యతకు అర్సెలార్ మిట్టల్ సంస్థ ప్రకటన నిలువుటద్దం అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల సమక్షంలో మార్చి 7న శంకుస్థాపన జరిగే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు మంత్రి కొల్లు రవీంద్ర. గతంలో రాష్ట్రాన్ని ఏలిన జగన్ రెడ్డి సర్కార్ పూర్తిగా విస్మరించిందని , అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు.





