నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : ఏం అర్హత ఉందని మాజీ సీఎం కేసీఆర్ ను విమర్శిస్తారంటూ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని ఉద్దేశించి ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. రూ. 7,900 కోట్లతో ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం ద్వారా 25 వేల స్కూళ్లను కేసీఆర్ అభివృద్ధి చేశారని అన్నారు. గురుకులాల గురించి కేసీఆర్ హయాంలో జరిగిన కృషిని వేరే చెప్పనక్కర్లేదని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, స్పోర్ట్స్ అకాడమీలు ఇలా ఎన్నో కేసీఆర్ హయాంలో ప్రారంభించిన విషయం ఆకునూరి మురళికి కనిపించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యా వ్యవస్థకు రాజకీయాలు జత చేయొద్దని మురళి అంటూనే కేసీఆర్ను ఎందుకు విమర్శిస్తున్నారంటూ ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పీఆర్సీ ద్వారా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచిన ఘనత కేసీఆర్దని అన్నారు. ఉపాధ్యాయుల జీతాలు పెంచకుండా రేవంత్ రెడ్డి విద్యా కమిషన్తో రిపోర్టు ఇప్పించుకున్నారని ఆరోపించారు ఆర్ఎస్పీ. ఉపాధ్యాయులకు టెస్టులు పెట్టి ప్రమోషన్లు ఇవ్వాలని మురళి రిపోర్టు ఇచ్చారు. మరి ఐఏఎస్, ఐపీఎస్ల ప్రమోషన్లకు టెస్టులు వద్దా అని నిలదీశారు. విద్యా వ్యవస్థలో ఉన్నత ప్రమాణాలు రావాలంటే ఉపాధ్యాయుల జీతాలు గౌరవప్రదంగా ఉండాలి అని మేధావులు ఎన్నోసార్లు చెప్పారని ఆ విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. ఇది నిచ్చెన మెట్ల సమాజమని మురళికి తెలియదా అని సూటిగా ప్రశ్నించారు.





