తెలంగాణ సర్కార్ బక్వాస్ అన్న కేటీఆర్
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు అయ్యాయో చెప్పాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆచరణకు నోచుకోని హామీలతో జనాన్ని బురిడీ కొట్టించారని ఆరోపించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని మా పార్టీ నుంచి ద్రోహం చేసి పోయిన వ్యక్తికి ఇచ్చారని ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, పిటిషన్స్ కమిటీ లేదు. ఇలా డిప్యూటీ స్పీకర్ కూడా శాసన సభలో లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
కేవలం అనివార్యంగా శాసనసభ సమావేశాలను నడిపించాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం బలవంతంగా నడిపిస్తున్నదని ఎద్దేవా చేశారు కేటీఆర్. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభలోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్ను ప్రయోగిస్తున్నదని మండిపడ్డారు. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో అబద్ధాలను, అసత్యాలను పచ్చిగా మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ శాసనసభ సమావేశాలను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు.





