మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
అమరావతి : మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కూటమి సర్కార్ బక్వాస్ అంటూ కొట్టిపారేశారు. ఆచరణకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి నేతలకు పేర్ని నాని సవాల్ వేశారు. ఇదే సమయంలో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి కాదని తను అప్పుల శాఖ మంత్రి అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్య పెట్టడంలో చంద్రబాబు నాయుడు రాటు దేలాడని అన్నారు పేర్ని నాని. ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్దాలనని పేర్కొన్నారు.
తమ పార్టీకి చెందిన అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేవదీసిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి. ఇప్పటి వరకు ఒక్క ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. పక్కా ఆధారాలతో ఆరోపణలు చేసిన జగన్ రెడ్డికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూటమి సర్కార్ పై, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్, రెడ్ బుక్ పేరుతో రెచ్చి పోతున్న నారా లోకేష్ పై ఉందన్నారు పేర్ని నాని. ఇదిలా ఉండగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక్క విషయమైనా అబద్ధమని మీరు నిరూపించుగలరా అని నిలదీశారు. దమ్ముంటే తమతో ప్రత్యక్ష చర్చకు సిద్దం కావాలని సవాల్ విసిరారు.







