జనం చెవుల్లో పూలు పెట్టిన సీఎం చంద్రబాబు
అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ సర్కార్ ను ఏకి పారేశారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ సౌకర్యం అంటూ కూటమి ప్రభుత్వం చెప్తున్నది ఉత్తమాటలేనని మండిపడ్డారు. కొత్త బస్సులు లేకపోగా ఉన్న బస్సులు ఆగడానికి దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాయకరావు పేట వెదురుపాలెం గ్రామ పరిధిలో నిర్వహించిన రచ్చబండ వేదికగా గ్రామస్థులు న్యాయంపుడి, ఏదులపాలెం గ్రామాలలో బస్సులు ఆపడం లేదని, తమ బిడ్డలు బడికి దూరం అయ్యారని, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు . వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు షర్మిలా రెడ్డి.
తక్షణం బస్సులు ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ డీఎం హామీ ఇచ్చారని తెలిపారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పేదలకు భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామాల్లో పేదరికాన్ని రూపుమాపి, వలసలు నివారించి, గ్రామ స్వరాజ్యాన్ని సాధించిన పథకం ఇది అన్నారు. ఇలాంటి గొప్ప పథకాన్ని ప్రధాని మోదీ చంపేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలో ఉపాధి లేకుండా ఊపిరి తీస్తున్నారని వాపోయారు షర్మిలా రెడ్డి. కాంగ్రెస్ చేపట్టిన పరిరక్షణ యాత్రలో భాగంగా మన్రేగా చట్టాన్ని పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు. పాయకరావుపేట లో శ్రామికులతో కలిసి కరువు పని చేసి, కాంగ్రెస్ పక్షాన 100 రోజుల పనిపై భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.





