సంచలన ఆరోపణలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని, నేతలను ఏకి పారేశారు. తాము అభివృద్ది కోసం ప్రయత్నం చేస్తుంటే అడుగడుగునా అడ్డు చెబుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రధానంగా ఆయన మూసీ ప్రాజెక్టు గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు. మూసీ పరీవాహకంలో మురికి వాడల్లో పేదలు ఆత్మగౌరవాన్ని వదులుకుని బతకాలా!? వారు స్వచ్ఛమైన, ఆరోగ్య వంతమైన వాతావరణంలో జీవించాలన్నది మా ఆకాంక్ష అని స్పష్టం చేశారు సీఎం. నది పునరుజ్జీవనంతో పాటు, పేదలకు ఆత్మగౌరవంతో కూడిన పునరావాసం కల్పించడానికి సిద్ధం గా ఉన్నాం అని ప్రకటించారు రేవంత్ రెడ్డి.
మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధ సత్యాలను ప్రచారం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు సీఎం . అధికారాన్ని కాపలాదారుగా వినియోగిస్తాం తప్పా, ప్రజలపై ఆధిపత్యం చెలాయించడానికి కాదు అనేది మా ప్రభుత్వం నమ్ముతుందన్నారు. చరిత్ర నుండి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్ కు ప్రణాళికలు వేసుకోవడం విజ్ఞుల లక్షణం అన్నారు. మూసీ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. అందరి సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం అని పిలుపునిచ్చారు.





