బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్ : పరమత సహనం, శాంతి సామరస్యాలకు ప్రతీక రంజాన్ పండుగ అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇఫ్తార్ విందు’లో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు యుద్ధాలు, ఘర్షణలతో సతమతమవుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సమర్థ నాయకత్వంలో మన భారతదేశం శాంతి, సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తోందని ఈ సందర్భంగా తెలియజేశారు.
“సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్” అనే మూల మంత్రంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు రాంచందర్ రావు. కుల, మత, వర్గ భేదాలకు తావులేకుండా దేశంలోని ప్రతి పౌరుడి సంక్షేమమే ధ్యేయంగా మోదీ పాలన సాగుతోందన్నారు. యావత్ ప్రపంచంలోని ప్రముఖ దేశాలన్నీ మోదీ పాలన గురించి ప్రశంసలు కురిపిస్తున్నారంటూ స్పష్టం చేశారు. భారత దేశం సత్తా ఏమిటో ఇప్పటికే పక్క దేశాలకు తెలిసి పోయిందన్నారు. నిన్నటి దాకా కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన ఘనత మోదీకే దక్కతుందన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు , రాష్ట్ర పార్టీ పదాధికారులు, నాయకులు పాల్గొన్నారు.





