5 బిలియన్ భోజనాల మైలు రాయి
న్యూఢిల్లీ : ఇస్కాన్ కు చెందిన అక్షయ పాత్ర అరుదైన రికార్డు సాధించింది. సంస్థ ప్రారంభించి నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంతే కాదు ఏకంగా 5 బిలియన్ భోజనాలను అందించి రికార్డు సృష్టించింది. ఈ సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంస్థను ప్రత్యేకంగా అభినందించారు. 2047 నాటికి ‘వికీత్ భారత్’ను నిర్మించాలన్న మన జాతీయ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో పోషకాహారం, విద్య కలిగిన సమాజం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో అక్షయపాత్ర ఫౌండేషన్ సభ్యులు, ప్రముఖులతో రాష్ట్రపతి భేటీ అయ్యారు.
‘విజయ భారత్ కోసం సుపోషిత, సుశిక్షిత భారత్’ అనే ఈ కార్యక్రమం, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పిల్లల పోషణ , విద్య దిశగా జరుగుతున్న ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించింది. రాష్ట్రపతి ముర్ము బహుమతులు పంపిణీ చేసి, భోజనం వడ్డించి, స్వయంగా పిల్లలకు తినిపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పీఎం పోషణ్ కార్యక్రమానికి అమలు భాగస్వామిగా, అక్షయపాత్ర భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది పిల్లలకు తాజా, పోషకమైన భోజనాన్ని అందిస్తోంది. ఈ ఫౌండేషన్ ప్రస్తుతం భారతదేశంలోని 16 రాష్ట్రాలు , 3 కేంద్రపాలిత ప్రాంతాలలో 78 ప్రదేశాలలో ఉన్న తన వంటశాలల ద్వారా 23.5 లక్షల మంది పిల్లలకు ఆహారం అందిస్తోంది .






