మరో మూడు రోజుల పాటు కురుస్తాయి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తాయి. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. సీఎం ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో వైపు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఏపీలో రానున్న మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అవసరమైతే తప్పా ప్రజలు బయటకు రావద్దని సూచించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.
రాత్రికి కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఎల్లుండి ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రావచ్చని పేర్కొంది. అకాల వర్షాల నేపథ్యంలో మినుము, మిరప, పసుపు ఇతర పంటలను తడవకుండా భద్రపరుచు కోవాలని తెలిపింది






