ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కామెంట్
హైదరాబాద్ : గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యంతో జన జీవనం స్తంభించిన పరిస్థితి నెలకొందన్నారు. అలాంటి నగరాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ కారణాలతో మూసీ పునరుజ్జీవనంను అడ్డుకోవడం ఏ సంస్కృతి? అని ప్రశ్నించారు .హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక అని అన్నారు. మూసీ పరీవాహకంలో చారిత్రక శివాలయాన్ని పునర్నిర్మించాలని ఈశ్వరుని ఆశీర్వాదంతో పనులు మొదలు పెట్టాం అన్నారు. దీనిపై పెడర్ధాలు తీసి విమర్శించే వారిపై ప్రజలే శివతాండవం చేస్తారని హెచ్చరించారు సీఎం.
మూసీ పరివాహకంలో మత సామరస్యానికి చిహ్నంగా ఒక మసీదు, నాగోల్ ప్రాంతంలో ఒక చర్చిని నిర్మించ బోతున్నాం అని ప్రకటించారు. గోదావరి జలాలను తరలించి మూసీలో నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు . మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఆ ప్రజల కష్టాలు చూడలేని వారు రాయి కంటే కఠినాత్ములు అని మండిపడ్డారు సీఎం. మానవ తప్పిదాలను సరిద్దిద్దక పోతే చరిత్ర మనల్ని క్షమించదన్నారు. మూసీ పరివాహక ప్రజా ప్రతినిధులు మూసీ ప్రక్షాళన చెయ్యాల్సిందే అని రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తున్నారని చెప్పారు.





