సమర్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు
ఒంటిమిట్ట/ తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఆలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా సీఎంకి శేష వస్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు, ఒంటిమిట్ట రాములవారి చిత్రపటం అందజేశారు. అంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 80 వేల మందికి పైగా భక్త బాంధవులు విచ్చేశారు ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేఈవో శరత్ తదితరులు పాల్గొన్నారు.







