newsseals.com
News

జగన్ ఈ జన్మకు అధికారంలోకి రాలేడు

VijayaBhaskar April 2, 2026
newsseals-SSavitha
Spread the love

రాష్ట్రంలో అంబురాన్నింటిన సంబురాలు

పెనుకొండ : అమ‌రావ‌తి రాజ‌ధాని బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొంద‌డంతో ఏపీలో పెద్ద ఎత్తున సంబురాలు మిన్నంటాయి. ఈ సంద‌ర్బంగా మంత్రి ఎస్. స‌విత ఆధ్వ‌ర్యంలో పెనుకొండ‌లో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ర్యాలీ చేప‌ట్టారు. అనంత‌రం మంత్రి మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా, తమ రాష్ట్రానికి రాజధాని ఉండాలన్న తపనతో, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో అమరావతి ప్రాంత రైతులు ఉచితంగా 33 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో రూపాయి కూడా ఖర్చు చేయకుండా వేల ఎకరాలు సేకరించడం చంద్రబాబుకే సాధ్యమన్నారు. పిచ్చోడి చేతికి రాయి దొరికినట్లు…అందివచ్చిన అధికారంతో జగన్ అమరావతిని, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారన్నారు.

ఆయన అసమర్థ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. మూడు రాజధానులంటూ అమరావతికి భూములిచ్చిన రైతులపై, వారి మహిళలపై దాడులకు, వేధింపులకు దిగారన్నారు. అమరావతి ప్రాంత రైతుల త్యాగం వృథా కాలేదని, పార్లమెంట్ సాక్షిగా అయిదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధానికి చట్టబద్ధత లభించిందన్నారు. అమరావతిపై జగన్ కుట్ర పన్నారని మంత్రి సవిత మండిపడ్డారు. రాజధానిపై రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. విపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన జగన్, అధికారంలోకి రాగానే మాట మార్చేశారన్నారు. ఏపీలో మూడు రాజధానులంటూ రాష్ట్ర ప్రజలను మనోవేదనకు గురిచేశారన్నారు. ఇప్పుడు పార్లమెంట్ లో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడంతో, జగన్ మైండ్ పనిచేయడం లేదన్నారు.