కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్ : రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. వాటినన్నింటిని సరి చేసి , పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రజా ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ భారతి లో కీలక మార్పులు చేశామన్నారు. ధరణి పోర్టల్ సాదా బైనామాకు సంబంధించిన సుమారు 9.52 లక్షల దరఖాస్తులను పరిష్కరించకుండా వదిలేసిందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటువంటి కేసులను క్రమబద్ధీకరించడానికి, భూమిని సాగు చేస్తున్న, స్వాధీనంలో ఉన్నవారి సమ్మతి పొందిన తర్వాత వారికి యాజమాన్య హక్కులు కల్పించేలా ప్రభుత్వ పరంగా ఉత్తర్వు జారీ చేశామన్నారు.
ఇందులో భాగంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీల నుండి మున్సిపాలిటీలుగా మారిన ప్రాంతాలకు కూడా ఈ నిబంధనలను విస్తరిస్తామని పేర్కొన్నారు. GPOల నియామకంతో 10,984 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా విభజించినట్లు మంత్రి తెలిపారు; అలాగే, ఆరు నెలల వ్యవధిలో రెండు దశలుగా సుమారు 5,300 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అదనంగా, ప్రతి మండలంలో నలుగురు నుండి ఆరుగురు లైసెన్స్ పొందిన సర్వేయర్లను నియమించామన్నారు పొంగులేటి.





