జూలై 14 వరకు కొనసాగుతుందని ప్రకటన
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. నీటి సంరక్షణ అనేది ఇప్పుడు అత్యంత అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘‘100 రోజుల నీటి వినియోగ డ్రైవ్’’ అనే కార్యక్రమాన్ని ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభించిందని చెప్పారు. ఈ కార్యక్రమం వచ్చే జూలై 14వ తేదీ వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో చైతన్యం కలిగించి భూగర్భ జలాల పెంపుదల, నీటి వృథాను అడ్డుకోవడం, నీటిని జాగ్రత్తగా వినియోగించు కోవడం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం వంటి చర్యలను తీసుకోవడంపై ఫుల్ ఫోకస్ పెడుతుందన్నారు. ప్రకృతిలో మన జీవనం.. జీవితం ముడిపడి ఉందనేది భారతీయ సంస్కృతికి మూలం అన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల.
ప్రకృతిని కాపాడుకుంటే, ప్రకృతి మనకు మంచి చేస్తుందని అన్నారు. జీవితాన్ని, ప్రకృతిని సమతుల్యం చేసుకుంటేనే భవిష్యత్తు అనేది ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచు కోవాలని అన్నారు. ప్రకృతి ఇచ్చిన నీటి వనరులను ఉపయోగించు కోవడంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ వర్క్ షాపులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ , కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా.పి కృష్ణయ్య , ఏపీ ఎస్ఐఆర్డీ కమిషనర్ ముత్యాల రాజు , అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.





