జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అమరావతి : కార్యకర్తలు టీడీపీకి బలగమని మీరు లేకపోతే పార్టీ లేదన్నారు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘మై టీడీపీ యాప్’ సమర్థ వినియోగం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న టాప్ 10 ఫెర్ఫార్మర్స్ తో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
తెలుగుదేశం కేడర్ శిక్షణా తరగతుల్లో భాగంగా కాఫీ కబుర్లు పేరుతో పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ చార్జిలతో భేటీ అయ్యారు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు సమూల మార్పులు తెస్తున్నాం అని ప్రకటించారు . ప్రతి టర్మ్ లోనూ 33శాతం కొత్తవారు ఉండాలన్నది మా అభిమతం అని పేర్కొన్నారు. పైరవీలతో పనిలేదని, పనితీరే ప్రామాణికంగా పదవులు కేటాయిస్తాం అని వెల్లడించారు నారా లోకేష్. జూన్ తర్వాత అందరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.





