జిల్లా పరిషత్ హైస్కూల్ ఆకస్మిక తనిఖీ
అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లా సింగనమల శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సంచలనంగా మారారు. తను సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు వింటూ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత శాఖాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఏపీ కూటమి సర్కార్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు తీరు పట్ల ఆరా తీస్తున్నారు. ఆపై ఎలా చివరి వరకు అందుతున్నాయో కూడా ప్రశ్నిస్తున్నారు. పరుగులు పెట్టిస్తున్నారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పంతులమ్మ అవతారం ఎత్తారు. పుట్లూరు మండల కేంద్రంలోని జెడ్పి హైస్కూలును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజన నాణ్యత పరిశీలించి, ఇంకా మెరుగైన నాణ్యతతో ఆహారాన్ని అందించాలని సూచించారు. కోడిగుడ్డు సైజు ఇంకా పెద్దవి సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నీటికి సంబంధించిన ఆర్.ఓ. మరమ్మతులకు గురైందని, స్కూల్ వేళకు వచ్చేందుకు సకాలంలో బస్సులు రావడం లేదని, స్కూల్ కు గ్రౌండ్ కు ప్రహరిగోడ లేదని విద్యార్థులు వాపోయారు. విద్యార్థులు తెలిపిన సమస్యలను సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.





