ఇచ్చామన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22ఏ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. అలాగే ఇతర సర్వీస్ ఇనాంలోని మరో లక్ష ఎకరాల భూములకూ విముక్తి కల్పించేందుకు 2019లోనే ఆర్డినెన్స్ తెచ్చాం అని తెలిపారు. 2016కు ముందు ఏదైనా ప్రభుత్వ హౌసింగ్ స్కీంలో పట్టా పొందిన ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం దాదాపు 75 లక్షల పేద కుటుంబాలకు వరంగా మారనుందని అన్నారు. 2016 ముందు పట్టా కలిగిన యజమాని, నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, విక్రయించేందుకు, గిఫ్ట్ డీడ్గా ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. 22-ఏ నిషేధిత భూముల జాబితాను పూర్తిగా సంస్కరిస్తున్నాం అని చెప్పారు. గత ప్రభుత్వంలో 14 లక్షల ఎకరాల పట్టా భూముల్ని 22ఏలో పెడితే గుర్తించాం అని తెలిపారు.
22ఏపై కలెక్టర్ అధికారాలు వికేంద్రీకరిస్తున్నాం అని పేర్కొన్నారు. జేసీ, ఆర్డీవోలకు కొన్ని అధికారాలు బదలాయించాలని నిర్ణయించాం అని తెలిపారు. దీంతో సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. వెబ్ల్యాండ్ తప్పులు సుమోటోగా సరిదిద్దేలా ఆర్డీవోలు, తహశీల్దారులకు అధికారం ఇస్తాం అన్నారు. ఇప్పటికి 13.59 లక్షల ఎకరాల భూమి ఫ్రీహోల్డ్ కింద ఉందన్నారు. ఇందులో అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాల భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తాం అన్నారు. నిలుపుదల ఉత్తర్వులను ఎత్తివేస్తున్నాం అని ప్రకటించారు సీఎం. భూ వినియోగ మార్పులు, మిస్సింగ్ సర్వే నంబర్ల సేవలను త్వరలో ప్రారంభిస్తున్నాం అని తెలిపారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 9 లక్షల భూ లావాదేవీలు ఆటో-మ్యూటేషన్ చేశాం అన్నారు. సేల్, బహుమానం, పార్టీషన్ డీడ్స్లో 100 శాతం ఆటో-మ్యూటేషన్ తీసుకొచ్చాం. పట్టణ ప్రాంతంలోని ఆస్తులను కూడా ఆటోమ్యూటేషన్లోకి తీసుకువచ్చాం అని చెప్పారు.





