స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి : కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాలలో అభివృద్ది కార్యక్రమాలు వేగవంతం చేయాలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న సేవలపై పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో వసతుల కల్పనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని అన్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. పాఠశాలలు, హాస్టళ్లను సందర్శిస్తూ విద్యార్ధులకు అవసరం అయిన సౌకర్యాల కల్పన పై ఆలోచన చేయాలన్నారు. యువతకు క్రీడలు, కళలు తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నైపుణ్యాన్ని వృద్ధి చేసి వారిలో ఉన్న శక్తిని ద్విగుణీకృతం చేయాలన్నారు.
గ్రంథాలయాలను బలోపేతం చేయాలని సూచించారు పవన్ కళ్యాణ్. యువతలోని నైపుణ్యాన్ని, కొత్త ఆవిష్కరణలను వెలికితీసి ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాల”ని కలెక్టర్ కు సూచించారు.
పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. వర్షాకాలం లోపు కాకినాడ జిల్లా పరిధిలో తీర ప్రాంతం వెంబడి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుని పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అటవీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీకి పలు సూచనలు చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, రేషన్ మాఫియాని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.





