స్పష్టం చేసిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు
అమరావతి : మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. మత్స్యకారుల డిమాండ్ల మేరకు 2015-16లో 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని, దీనికి సంబంధించిన DPRలను WAPCOS ద్వారా సిద్ధం చేయించామని మంత్రి వివరించారు. ఫేజ్-1లో జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఫేజ్-2లో బుడగట్లపాలెం, పుడిమడక, కొత్తపట్నం, వొడరేవు హార్బర్లు ప్రతిపాదించబడ్డాయని చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిధులతో ఆమోదించగా, ప్రస్తుతం అది పూర్తి దశకు చేరుకుందని తెలిపారు.
ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వొడరేవు హార్బర్లు 2019-20లో ఆమోదించబడినప్పటికీ, అప్పటి ప్రభుత్వం FIDF రుణాన్ని సక్రమంగా వినియోగించకపోవడంతో పనులు మందగించాయని విమర్శించారు. ప్రస్తుతం ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తదుపరి కేంద్ర ప్రభుత్వం PMMSY పథకం కింద బుడగట్లపాలెం, పుడిమడక, కొత్తపట్నం హార్బర్లను ఆమోదించిందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం రూ.3,328.48 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి జరుగుతోందని మంత్రి తెలిపారు. వీటిలో కొన్ని పూర్తి దశకు చేరుకోగా, మరికొన్ని నిర్మాణంలో వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.
ఇక 2018-19లో ముంచినీలపేట, బియ్యపుటిప్ప ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధి ప్రారంభించినప్పటికీ, 2019 నుంచి 2024 వరకు నిధుల విడుదలలో జరిగిన ఆలస్యం కారణంగా అవి పూర్తికాలేదని చెప్పారు. అలాగే 2021-22, 2022-23లో PMMSY కింద భీమిలి, రాజయ్యపేట, చింతపల్లి, రాయదరువు, దొండవాక, ఉప్పలంక ప్రాంతాల్లో రూ.126.91 కోట్లతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు ఆమోదం లభించినప్పటికీ, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదని మండిపడ్డారు.





